*20.01.2025* *"నియోజక వర్గ అభివృద్ది అధికారులు సమన్వయంతో పని చేయాలి* *గన్నవరం నియోజక వర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్*" ఆర్ జె 7న్యూస్ గన్నవరం:- గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వ విప్ , గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సోమవారం విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ఒకరికొకరు సమన్వయంతో పని చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పలు కీలక సూచనలు చేసి, యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.